గురువారం, ఏప్రిల్ 18, 2024
పుచ్చు విత్తులు... విచ్చు కత్తులు!

వేరూనుకున్న అక్రమ వ్యాపారం

‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విత్తనోత్పత్తి పెంచడానికి భారీ స్థాయి సంస్థాగత ఏర్పాట్లు చేసినా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం సమస్యగానే ఉంది’ - పదో పంచవర్ష (2002-07 )ప్రణాళిక అమలు తీరుపై సమీక్ష సందర్భంగా అప్పటి ప్రణాళిక సంఘం చేసిన వ్యాఖ్యానమిది. రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతుండటం ఎవరి వైఫల్యం? రైతులను నాసిరకం విత్తనాల నుంచి కాపాడే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది జవాబు దొరకని ప్రశ్నగా మారింది. తొలకరి వర్షాలు మొదలు కాగానే దుక్కులు దున్ని- విత్తనాల కోసం దిక్కులు చూస్తున్న రైతులకు నాసిరకం విత్తులమ్మి దోచుకునే వ్యాపార వర్గాల కార్యక్రమం ఊపందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం నాసిరకం విత్తనాల విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేసి- అమ్మేవారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపాలన్నారంటే వీటి అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కొరవడిన ప్రణాళిక
క్రితం సంవత్సరం 2.90 కోట్ల ఎకరాల్లో సోయాచిక్కుడు పంటను రైతులు సాగుచేస్తే 1.34 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది సోయా సాగుకు విత్తనాల కొరత ఉందని కేంద్ర వ్యవసాయశాఖే తాజాగా ప్రకటించింది. ఇప్పుడు విత్తనాలివ్వాలంటే ఏడాది ముందే విత్తన పంటలు వేయాలి. కొరత వల్ల రైతులకు ఈ సీజన్‌లో సోయా విత్తనాలను రాయితీపై ఇవ్వలేకపోతున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ తెలిపింది. ప్రభుత్వాల నిష్క్రియాపరత్వంతో ప్రైవేటు కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. నిరుడు తెలంగాణ వ్యవసాయశాఖ సోయా విత్తనాలను రైతుకు క్వింటా రూ.5,727కు అమ్మింది. ఈ ఏడాది ప్రభుత్వాలే విత్తనాలు లేవని చెప్పడంతో ప్రైవేటు కంపెనీలు క్వింటా విత్తులను రూ.11,200కి పైగా వసూలుచేస్తున్నాయి. కేవలం ఏడాది వ్యవధిలో క్వింటాకు అదనంగా రూ.5,423 చొప్పున ధర పెరగడం గమనార్హం. ఒకవైపు ప్రభుత్వాలు విత్తనాలు లేవని చెబుతున్నాయి. మరి ప్రైవేటు కంపెనీలకు ఎక్కడి నుంచి వచ్చాయనేదీ అంతుచిక్కని వైనం. సోయాతోపాటు పత్తి, వరి, మొక్కజొన్న, కంది... ఇలా ప్రతి పంటలో నాసిరకం విత్తనాలను ధరలు పెంచి మరీ అమ్ముతున్నారు. విత్తనాల పంపిణీని కేంద్రం పూర్తిగా రాష్ట్రాలకు వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేసే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలు రైతులతో ఏడాది ముందే విత్తన పంటలు వేయించి- ఆ పంటలను కొని, శుద్ధి చేసి మరుసటి ఏడాది తొలకరిలో రైతులకు తక్కువ ధరలకు అమ్మాలి. కానీ చాలా రాష్ట్రాల సంస్థలు అసలు విత్తన పంటలే పండించడం లేదు. జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాల కొరత తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. వీటిని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు కంపెనీల నుంచి తెలుగు రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థలు అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. ఇలాగే సోయా వంగడాలను మధ్యప్రదేశ్‌ కంపెనీల నుంచి కొంటున్నాయి. ఈ కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు పెంచుతూ ఏటా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలతో ఆడుకుంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలనే నేరుగా విత్తనాలు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర సంస్థ అడిగితే- అవి చేతులెత్తేశాయి. ఆఖరికి జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఉన్నా అది- కొరత ఉన్న చోట సరఫరా చేసే బాధ్యత తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ విత్తన సంస్థలే ఏటా సీజన్‌ ఆరంభంలో హడావుడిగా టెండర్లు పిలిచి ప్రైవేటు కంపెనీల నుంచి కొని రైతులకు సరఫరా చేస్తున్నాయి. ఆ విత్తనాలూ మొలకెత్తక రైతులు నష్టపోతున్న ఉదాహరణలు కోకొల్లలు. నాసిరకం విత్తనాల నుంచి రైతులను కాపాడాలంటూ ఆదేశాలిచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు- విత్తనాభివృద్ధి సంస్థలకు నిధులు సమకూర్చి విత్తన పంటలు సాగు చేయించడంపై దృష్టి సారించకపోవడం విడ్డూరం.
నాణ్యతతోనే ఆహారభద్రత
నాణ్యమైన విత్తనాలు లేక చాలా పంటల ఉత్పాదకత పెరగడం లేదు. దేశ ఆహార భద్రతకు పూచీకత్తు అంతా విత్తన నాణ్యతలోనే ఉందని రెండు దశాబ్దాల క్రితం జాతీయ విత్తన ప్రణాళిక చాటింది. రైతు కుటుంబాల జీవన భద్రత, ఉపాధి- విత్తన నాణ్యతపైనే ఆధారపడి ఉంది. పాత విత్తనాలను ఏటా వాడకుండా కొత్త వంగడాలు వాడాలి. దేశంలో సాగయ్యే అన్ని రకాల పంటల్లో ఈ విత్తన మార్పిడి కనీసం 33శాతం ఉండాలి. వేరుసెనగలాంటి పంట సాగులో విత్తనమార్పిడి 25శాతమైనా లేదు. నాలుగు దశాబ్దాల నాటి సాంబమసూరి వరి విత్తనాలనే రైతులు ఇప్పటికీ సాగుచేస్తున్నారు. పదేళ్ల కిందటి విత్తనాల సాగును ప్రోత్సహించవద్దని, వాటిపై రాయితీ కూడా ఇవ్వవద్దని కేంద్రం చెబుతోంది. అయినా రాష్ట్రాలు రైతులను మళ్లించలేకపోతున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి తరఫున దేశవ్యాప్తంగా 103 జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు వేలాది కొత్త వంగడాలను విడుదల చేశాయి. ఇక 74 వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల నుంచి వందల రకాల విత్తనాలు వస్తున్నాయి. వీటిలో మంచివాటిని ఎంచుకుని రైతులకు చేర్చడంలో వ్యవసాయాధికారులు విఫలమవుతున్నారు. విత్తన వ్యాపారంలో సగానికి పైగా వాటా ప్రైవేటు కంపెనీలదే. నాణ్యమైన విత్తనోత్పత్తికి ప్రోత్సాహం సరిగ్గా లేదని విత్తన కంపెనీలు కేంద్రానికి ఇటీవల తెలిపాయి. అటు ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించక, ఇటు ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలు విడుదల చేసిన కొత్త వంగడాలనూ రైతుల దరిచేర్చక, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలకు రాష్ట్రాలు నిధులివ్వక నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మధ్యలో రైతులు నష్టపోతున్నారు. విత్తన గ్రామం పేరుతో ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులతో విత్తన పంటలు పెద్దయెత్తున సాగుచేయించి- వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో పంపిణీ చేసేలా వ్యవసాయశాఖ బాధ్యతలు తీసుకోవాలి. నాణ్యమైన విత్తనాలను రైతులకు చేర్చకుండా ఎన్ని పథకాలు అమలుచేసినా దిగుబడులు పెరగవు, రైతుల ఆదాయం రెట్టింపు కాదు, దేశ ఆహార భద్రతకు పూచీకత్తు లభించదని పాలకులు గుర్తించాలి.

నాసిరకం విత్తనాల వెల్లువ

గడచిన నెలరోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అంతంతమాత్రంగా జరిపిన దాడుల్లోనే కోట్లాది రూపాయల విలువైన నాసిరకం విత్తనాలు పట్టుబడ్డాయి. వీటి వెనక చిన్న వ్యాపారులే కాకుండా దోపిడీ వ్యవస్థీకృతమైనందునే- ఈ వ్యాపారం ఏళ్ల తరబడి నిరాటంకంగా సాగుతోంది. ప్రపంచంలో ఆరో అతి పెద్ద విత్తన మార్కెట్‌ భారతదేశానిదే. దేశంలో ఏటా విత్తన వ్యాపారం విలువ రూ.30 వేల కోట్లకు పైమాటే. 60 రకాల నేలలు, 15 రకాల విభిన్న వ్యవసాయ వాతావరణ ప్రాంతాలున్న ఈ దేశంలో నాణ్యమైన విత్తనాలపై పూచీకత్తు కరవైంది. ప్రపంచ విత్తన వ్యాపారం విలువ 2024కల్లా సుమారు 9,000 కోట్ల డాలర్లకు చేరుతుందని, అందులో భారత్‌ వాటా 900 కోట్ల డాలర్లకు పైనే ఉంటుందని అంచనా. అయినా, విత్తన ఎగుమతుల్లో ఇండియా వెనకబడటానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిపై రాష్ట్రాలకు శ్రద్ధ లేకపోవడమే.

- మంగమూరి శ్రీనివాస్‌